ఎస్ఈబీ జిల్లా జాయింట్ డైరెక్టర్ బిందు మాధవ్
విశాలాంధ్ర`గుంటూరు : అక్రమ మద్యం, అక్రమ ఇసుక, నాటుసారా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలు నిరోధించడానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత దాడులు నిర్వహించాలని ఎస్ఈబీ జిల్లా జాయింట్ డైరెక్టర్, అదనపు ఎస్పీ బిందు మాధవ్ గరికపాటి పోలీసు అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలోని అర్భన్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్ఈబీ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటూ మరలా వారు అక్రమ కార్యకలాపాలకు పాల్పడకుండా కేసులు నమోదు చేయాలని సూచించారు. కల్తీ మద్యం తయారీ, అక్రమ మద్యం సరఫరా, నాటుసారా తయారీ, విక్రయ కేంద్రాలపై నిఘా ఉంచి వాటిని నిర్మూలించడానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్లను పక్కాగా అమలు పరుస్తూ, ముద్దాయిలు మరోసారి నేరం చేయడానికి జంకేలా చూడాలన్నారు. నమోదు చేసిన కేసులలో నిందితులకు సత్వరమే శిక్షలు పడే విధంగా త్వరితగతిన ఛార్జ్షీట్ వేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఈబీ, ఎక్సైజ్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.