విశాలాంధ్ర, మచిలీపట్నం:జిల్లాలో ఆదివారం ఎంపిటిసి, జడ్పిటిసి కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న పోలీస్ అధికారులకు, సిబ్బందికి శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ప్రజలు ఎవరు రోడ్లపై గుమికూడకుండా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. అవసరం మేరకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకుని బందోబస్తు నిర్వహించాలన్నారు. ఏ చిన్న సమస్య తలెత్తే అవకాశం ఉన్నా వాటిని ముందస్తుగానే గ్రహించి అదుపులోకి తీసుకు రావాలని సూచించారు.