తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని, వాళ్లు ఏ పార్టీలో ఉన్న అదే రీతిని అవలంభిస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని తాము గురుతర బాధ్యతగా భావిస్తున్నామని చెప్పారు. గుజరాత్ ఏర్పడి 62 ఏండ్లైనా కరెంట్ కష్టాలున్నాయి. ఎనిమిదేండ్లలో తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందిస్తున్నాం. సంక్షేమం మీద అత్యధికంగా ఖర్చు చేస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని స్పష్టం చేశారు. ఆకర్షణీయ నినాదాలు ఇవ్వడంలో బీజేపీ ఫస్ట్ ఉంటుందని విమర్శించారు. తెలంగాణ ఏడేండ్ల సగటు ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉందన్నారు. భారతదేశం సగటు ఆర్థిక వృద్ధిరేటు 6 శాతమే అని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీలో వ్యవసాయ రంగందే 21 శాతం అని పేర్కొన్నారు. విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్గా ఉందన్నారు. ఐటీ, పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణనే ముందుందన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా రిజర్వేషన్లు అందక నష్టపోతున్నారని తెలిపారు.రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, వర్సిటీల కోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారు. కృష్ణా నదిలో వాటా ఇవ్వాలని యాత్ర చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏదైనా సాయం చేయాలని యాత్ర చేయాలి. రైతుబంధు, రైతుబీమా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని యాత్ర చేయాలి. బండి సంజయ్కు ఉన్న అవగాహన గుండు సున్నా అని అన్నారు.