మహబూబ్నగర్ : ప్రభుత్వ ఆసుపత్రి కోవిడ్ సెంటర్లో ప్రాణాలు ఫణంగా పెట్టి సేవలు అందించి, ప్రభుత్వానికి, వైద్య అధికారులకు చెరగని గౌరవం తెచ్చిన శానిటేషన్, సెక్యురిటి, సూపర్ వైజార్ కార్మికులను విధుల నుంచి అక్రమంగా తొలగించడం తీవ్ర అన్యాయామని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ)ఉమ్మడి జిల్లా అద్యక్షులు పి.సురేష్ ఆరోపించారు. సోమవారం కోవిడ్ కార్మికుల అక్రమ తొలగింపులను నిరసిస్తూ తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) ఆద్వర్యంలో మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.అనంతరం ఎక్సైజ్, క్రీడల యువజన,పురావస్తు శాఖ మంత్రి వర్యులు డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ నివాసంలో కలిసి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈసందర్భంగా పి.సురేష్ మాట్లాడుతూ మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్ కోసం శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులను ప్రభుత్వం మొదటి దశ, రెండో దశలో విధుల్లోకి తీసుకోవడం జరిగిందని వారికి 18 వేల జీతం, టెన్ పర్సెంట్ ఇన్సెంటివ్,హోం క్వారెంటెన్స్ సెలవులు, మూల వేతనానికి సంబంధం లేకుండా రోజుకు 300 రూపాయలు చెల్లింపులాంటి అనేక హామీలను ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిందని కానీ కేవలం రూ.8400 ప్రాణాలను పణంగా పెట్టి కరోనా రోగులకు సేవలు అందించారని అన్నారు. కరోనా రోగుల మలమూత్రాలు చేతులతో ఎత్తిపోస్తు, కరోన మృతదేహాలను రెండు మూడు అంతస్తుల పైనుంచి భుజాలపై వేసుకొని మోశారని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కార్మికులకు కనీస వసతులు లేకున్నా కార్మికులు తూచా తప్పకుండా అమలుచేసి స్థానిక మంత్రిగారికి వైద్యాధికారులకు ఆస్పత్రికి గొప్ప గౌరవాన్ని అందించిన కార్మికులను నేడు విధుల నుంచి తొలగించడం భావ్యం కాదని మండిపడ్డారు. ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న ప్రభుత్వం పెండిరగ్ జీతాలు చెల్లించకుండానే విధుల్లో నుంచి తొలగించే ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఇతర సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కోవిడ్ సెంటర్ కార్మికుల జీతాలు కోసం బడ్జెట్ కేటాయించ లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సహృదయంతో తొలగించిన శానిటేషన్, సెక్యురిటి, సూపర్వైజర్ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)ఆస్పత్రి బ్రాంచ్ అధ్యక్షుడు చెన్నయ్య ప్రధాన కార్యదర్శి జే.నరసింహ, శానిటేషన్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులు ఏ.యాదయ్య, శ్రీనివాస్, రాములు నాయక్, సూర్యనారాయణ, యాదగిరి, జమున, లక్ష్మీ, నర్సమ్మ,మంజుల, తదితరులు పాల్గొన్నారు.