టోక్యో : జపాన్ సార్వత్రిక ఎన్నికల్లో పాలక సంకీర్ణ కూటమి మెజారిటీ సాధించింది. ఈ కూటమికి నాయకత్వం వహించిన ఫుమియో కిషిడా విజయాన్ని ప్రకటించారు. దీర్ఘకాలంగా పాలిస్తున్న లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) దాని భాగస్వామి కొమెటోలతో కూడిన సంకీర్ణం దిగువ సభలో 465 సీట్లలో 293 మెజారిటీ నమోదు చేసింది. ఇంతకుముందుతో పోలిస్తే పాలక ఎల్డీపీ 17 సీట్లు కోల్పోయింది. సంకీర్ణ భాగస్వామి కొమెటోకి 32 సీట్లు లభించాయి. దీంతో అన్ని స్థాయీ సంఘాలకు చట్టబద్ధమైన కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ మెజారిటీ సరిపోతుంది. ప్రభుత్వ బడ్జెట్ను ఆమోదించడం, అంతర్జాతీయ ఒప్పందాల ధ్రువీకరణను దిగువ సభ నిర్వహిస్తుంది. ప్రధాన ప్రతిపక్షమైన కానిస్టిట్యూషనల్ డెమోక్రాటిక్ పార్టీఆఫ్ (సీడీపీజె) 96 సీట్లతో సరిపెట్టుకుంది. జపాన్ ఇన్నోవేషన్ పార్టీకి 41 సీట్లు లభించాయి. ఈనెల 10న జపాన్ పార్లమెంటు ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఆ రోజున ప్రధానిగా కిషిడాను కొనసాగిస్తున్నట్లు ప్రకటిస్తారు.